తెలంగాణ ఏర్పాటుకు పునాది వేసింది చంద్రబాబే

Update: 2018-11-28 09:55 GMT

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నారా చంద్రబాబునాయుడు పునాదులు వేశారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క పేర్కొన్నారు. బుధవారం ఖమ్మం ప్రజాకూటమి బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ... ఆనాడు నిండు శాసనసభలో అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్స్ అభిప్రాయాలు తీసుకున్నప్పుడు టీడీపీ తరపున చంద్రబాబు నాయుడు తెలంగాణ ఏర్పాటు చేయాలని స్పష్టంగా చెప్పారని పేర్కొన్నారు. అదే రోజు సాయంత్రం స్వయంగా ఆయన ఆనాటి ముఖ్యమంత్రి రోశయ్య కార్యాలయానికి వచ్చి తెలంగాణ ఏర్పాటు చేయాలని లిఖితపూర్వకంగా లేఖ ఇచ్చింది చారిత్రక సత్యమని గుర్తు చేశారు. ఆనాడు డిప్యూటీ స్పీకర్ గా ఉన్న తానే ఇందుకు సాక్ష్యమన్నారు. తెలంగాణ ఏర్పాటుకు చంద్రబాబు సంపూర్ణ మద్దతు ఇచ్చారని టీడీపీ నేత నామా నాగేశ్వర్ రావు పేర్కొన్నారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ముందుకు వెళ్లమని భుజం తట్టి చెప్పినందునే తెలంగాణ బిల్లుకు మద్దతుగా పార్లమెంటులో మొదటి ఓటు వేశానని ఆయన స్పష్టం చేశారు.

Similar News