Weather Report : మధ్యాహ్నం ఎండ .. సాయంత్రం వర్షం.. ఇదెక్కడి వెదర్ రా బాబూ
తెలుగు రాష్ట్రాల్లో నేడు కూడా కూల్ వాతావరణం నెలకొనే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది;

తెలుగు రాష్ట్రాల్లో నేడు కూడా కూల్ వాతావరణం నెలకొనే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. అయితే నేడు కొన్ని చోట్ల అకాల వర్షాలు, పిడుగులు పడతాయని కూడా తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కోరింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ లోని 52 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని, అదే సమయంలో వర్షాలు కూడా కురిసే ఛాన్స్ ఉందని తెలిపింది. గత రెండు మూడు రోజుల నుంచి తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గాయి.
తగ్గిన ఉష్ణోగ్రతలతో...
గత వారం రోజుల క్రితం వరకూ 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా, గత మూడు రోజుల నుంచి 30 డిగ్రీలకు మించకపోవడంతో పాటు వర్షాలు పడుతుండటంతో ప్రజలు కొంత హ్యాపీగా ఉన్నారు. ఈ ఏడాది వేసవి ముందే వచ్చిందనుకుంటున్న సమయంలో ఉపరితల ద్రోణి ప్రభావంతో కొంత వాతావరణం చల్లబడటంతో ప్రజలు ఊరట చెందుతున్నారు. ఎటూ ఏప్రిల్, మే నెలల్లో ఎండల తీవ్రత తప్పదు. కానీ మార్చి నెలలోనే ఇంతటి ఎండలను గతంలో ఎన్నడూ చూడకపోవడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.
తెలంగాణలో నేడు...
ఈరోజు తెలంగాణలోని ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్ నగర్, నిజామాబాద్, నల్లొండ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. వర్షాలు పడటంతో మధ్యాహ్నానికి ఎండ తీవ్రత అధికంగా ఉండి సాయంత్రానికి వర్షాలు అనేక చోట్ల పడతాయని తెలిపింది. అయితే అకాల వర్షాలు, వడగండ్ల వానలతో పండ్ల తోటల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఇప్పటికే అనేక పంటలు దెబ్బతినడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సాయంత్రానికి వర్షం వస్తుందన్న వాతావరణ శాఖ సూచనతో రైతుల గుండె గుభేలమంటుండగా, సామాన్య జనం మాత్రం సేదతీరుతున్నారు.