నేడు ఈ మండలాల్లో తీవ్ర వడగాల్పులు
నిన్న విజయనగరం జిల్లా కనిమెరకలో అత్యధికంగా 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మన్యం జిల్లా పాచిపెంటలో 44.9°C..;

severe heat waves today in ap
ఏపీలో మరో రెండురోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు తప్పవని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి డా.బిఆర్ అంబేద్కర్ తెలిపారు. ఆదివారం రాష్ట్రంలోని 315 మండలాల్లో వడగాలులు వీస్తాయని వెల్లడించారు. 109 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 206 మండలాల్లో వడగాల్పులు వీస్తాయని వివరించారు. అల్లూరి 9, అనకాపల్లి 6, బాపట్ల 8, తూర్పుగోదావరి 17, ఏలూరు12, గుంటూరు 9, కాకినాడ 18, కోనసీమ 7, కృష్ణా 15, మన్యం 5, పశ్చిమగోదావరిలో 3 మండలాల్లో తీవ్రవడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు. అలాగే ఉష్ణోగ్రతలు 42 - 44 డిగ్రీల మధ్య నమోదు కావొచ్చని, ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అలాగే సోమవారం (జూన్19) 73 మండలాల్లో తీవ్రవడగాల్పులు, 227 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని, ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. శనివారం 478 మండలాల్లో వడగాలులు వీచాయి. నిన్న విజయనగరం జిల్లా కనిమెరకలో అత్యధికంగా 45.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మన్యం జిల్లా పాచిపెంటలో 44.9°C, ఏలూరు జిల్లా కామవరపుకోటలో 44.7°C, నెల్లూరు జిల్లా కొండాపురంలో 44.5°C, అల్లూరి జిల్లా ఎర్రంపేటలో 44.3°C, తూర్పుగోదావరి జిల్లా చిట్యాల, కృష్ణా జిల్లా నందివాడ, ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో 44.1°C, అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో 44°C అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వెల్లడించారు.